ఇప్పపువ్వు సేకరణతో ఉపాధి పొందండి : ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్

✍🏽 దివిటీ – భద్రాచలం (జనవరి 9)
పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులు వ్యవసాయంతో పాటు సీజన్ పరంగా వచ్చే ఇప్పపువ్వు కూడా సేకరించుకుని ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ కోరారు.
మంగళవారం ఐటీడీఏ ఆవరణలోని ఖాళీ ప్రదేశాలలో ఇప్పపువ్వు మొక్కలను యూనిట్ అధికారుల సమక్షంలో నాటారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ, ఖండాంతరాలలో పేరుగాంచిన భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీసీతారామచంద్రస్వామివారికి అతిప్రీతిపాత్రమైన ప్రసాదం ఇప్పపువ్వు అన్నారు. రాములవారికి ఇప్పపువ్వు అంటే చాలా ఇష్టమని, రాముల వారి ప్రసాదాలలో తప్పనిసరిగా ఇప్పపువ్వు కలుస్తుందన్నారు. అంతటి మహిమ కలిగిన ఇప్పపువ్వును మూడు నెలలపాటు సేకరించి గిరిజనులు ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉందన్నారు. ఇప్పపువ్వు మొక్కలను తనవంతు సహకారంగా పంపిణీ చేయడానికి పూనుకుని, ప్రస్తుతం అటవీశాఖ సహకారంతో 2500 మొక్కలు సేకరించి గిరిజనులకు పంపిణీ చేసినట్లు పీఓ తెలిపారు. గిరిజన రైతులు వ్యవసాయంతో పాటుగా పొలంగట్లపై ఖాళీ ప్రదేశాల్లో, నర్సరీలలో ఇప్పచెట్లు పెంచి అంతరించిపోతున్న ఇప్పపువ్వు సంపదను వృద్ధిలోకి తేవాలని ఆయన కోరారు. ఇప్పపువ్వు వల్ల కలిగే ప్రయోజనాలు, లాభాల గురించి బాగా అవగాహన కలిగి ఉన్నందున గిరిజనులు ఇప్పపువ్వును సేకరించి జీసీసీకి అమ్మి ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో నాటిన ఇప్ప మొక్కల సంరక్షణకు సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ (జనరల్) డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మణెమ్మ, ఈఈ తానాజీ, ఎస్ఓ సురేష్ బాబు, ఏసీఎంఓ రమణయ్య, అగ్రికల్చర్ ఏడీ భాస్కర్, ఏటీడీఓ నర్సింగరావు, మేనేజర్ ఆదినారాయణ, ఐటీడీఏలోని పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
