ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుల వెల్లువ
పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కలెక్టర్
✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (జనవరి 8)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి సమస్యలపై కలెక్టర్ డా ప్రియాంకఅల, ఉన్నతాధికారులకు దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా వచ్చిన పలు ఫిర్యాదులు, వినతుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ డా.ప్రియాంకఅల అధికారులను ఆదేశించారు. ప్రజలిచ్చిన దరఖాస్తులు స్వీకరించి, వివరాలు తెలుసుకుని పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ రాంబాబు, మధుసూదన్ రాజు, డీఆర్ఓ రవీంధ్రనాథ్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు కొన్ని…
బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన పూజారి శ్రీదేవి, తాను భద్రాచలం మొబైల్ కోర్టులో 8 సంవత్సరాల నుంచి స్వీపర్ కం కుక్ పనిచేస్తున్నానని, తనకు జీవించడానికి ఎలాంటి ఆదాయ వనరులు లేవని, భర్త చనిపోయారని పేర్కొన్నారు. తనకున్న ఇద్దరు పిల్లల పోషణ, చదువులకు తనకొచ్చే వేతనం రూ.6 వేలు సరిపోవడం లేదని, అది కూడా రెండు, మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారని, అందువల్ల తనకు కాంట్రాక్టు పద్దతిలో కుక్ పోస్టు ఇప్పించాలని దరఖాస్తు చేశారు.
పాల్వంచ మండలం, జయమ్మకాలనీ, వికలాంగులకాలనీ ప్రాంతాలకు చెందిన ఇసనపల్లి నాగరాజు, ఎస్.కె.రెబానా, ఎం.వెంకటేశ్వర్లు గతంలో తాము డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అర్హులైన పేదలను గుర్తించి ఎంపిక చేసి ప్రభుత్వం ద్వారా విచారణ కూడా నిర్వహించారని, కానీ ఇంతవరకు ఆ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదని, ఆ ఇళ్లను తమకు ఇప్పించాలని దరఖాస్తులు అందజేశారు.
టేకులపల్లి మండలం, శంభునిగూడెం గ్రామానికి చెందిన సనప కృష్ణవేణి, తన భర్త బట్టు సురేష్ మరణించారని, కోయ కులానికి చెందిన తాను 2011 మే 24న అంగన్వాడీ కార్యకర్తగా విధుల్లో చేరి 4నెలలపాటు విధులు కూడా నిర్వహించానని పేర్కొన్నారు. ఆ తరువాత గోప్యాతండా వాసులు స్థానికంగా ఉన్న వారికి ఇవ్వకుండా వేరే గ్రామం వారికి ఉద్యోగం ఇచ్చారని పిర్యాదు చేయడం వల్ల తన నియామకాన్ని నిలిపివేశారని తెలిపారు. దీనిపై విచారణ నిర్వహించి తనకు ఉద్యోగావకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
అశ్వారావుపేట మండలం, బబ్బువారిగూడెం గ్రామానికి చెందిన కట్టం అర్జమ్మ, గత సంవత్సరం నిర్వహించిన పోడుభూముల సర్వేలో తమకు పట్టాదారు పాసుపుస్తకం 9ఏ అని వచ్చిందని, దానిలో 9 కుంటలుగా భూమి విస్తీర్ణం నమోదైందని పేర్కొన్నారు. ఆ భూమికి రైతుబంధు నిధులు కూడా రావడంలేదని, పాసుపుస్తకం ప్రింట్ తప్పుపడిందని సరిచేసి ఇస్తామని చెప్పారని, ఇంతవరకు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. తమకు ఆ పట్టాదారు పాసుపుస్తకంలో వివరాలు సవరింపజేసి ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.