కూనేటి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
‘దివిటీ మీడియా’ కథనం ఎఫెక్ట్ ; స్పందించిన కాంట్రాక్టర్
సమస్య పరిష్కారంపై గ్రామస్తుల ఆశాభావం
✍🏽 దివిటీ – జి.మాడుగుల (జనవరి 7)
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం పరిధిలోని కూనేటి గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీరనున్నాయి. తాగునీటి సమస్య కారణంగా గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విషయం వెలుగులోకి తీసుకొస్తూ ‘దివిటీ మీడియా’లో మూడురోజుల క్రితం (జనవరి 4వ తేదీన) కథనం సమగ్ర కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ కథనం మీద స్పందించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనలతో సంబంధిత కాంట్రాక్టర్ కూనేటి గ్రామానికి వెళ్లి మరోసారి ఆ పథకాన్ని పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడిన సమస్య తీవ్రత కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న పనులు పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్, గ్రామస్థులతో మాట్లాడిన సందర్భంగా ‘దివిటీ మీడియా’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావించారు. కథనం చూసిన వెంటనే తాము స్పందించి పరిశీలనకు వచ్చామని, సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. కూనేటి గ్రామంలో 2022లో ప్రభుత్వం ‘వైఎస్సార్ జలకళ’ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరందించేందుకు బోరు తవ్వించి, పైపులు తెచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ పనులు పూర్తి చేయకపోవడం ‘దివిటీ మీడియా’ ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు, ఆ కాంట్రాక్టర్లు స్పందించి పునఃప్రారంభం కోసం చర్యలు తీసుకోవడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్థులు, ఆ సమస్య దివిటీ మీడియాకు తెలియజేసిన విద్యార్థి నాయకుడు వనుగు త్రినాధ్, కూనేటి గ్రామస్తులు వంజరి బలంనాయుడు, సాగెని బొంజిబాబు, మాతే పండుదొర, పాంగి సింహాచలం, తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు.