మేడిగడ్డ లోపాలపై పూర్తి వివరాలందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

నీటిపారుదల ప్రాజెక్టుల పరిస్థితులపై సమీక్షించిన సీఎం
✍🏽 దివిటీ – హైదరాబాదు
కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదలశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం (డిసెంబర్ 18) ఆయన తన నివాసంలో నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులనడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలతోపాటు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను వీలైనంత త్వరగా అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ.ఎన్.సీ మురళీధర్, పలువురు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.