Divitimedia
Bhadradri KothagudemHealthHyderabadLife StyleTelanganaWomen

మాతా శిశు ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

మాతా శిశు ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

వైద్యాధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ ప్రియాంకఅల

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

వైద్యాధికారులు మాతా శిశు ఆరోగ్య పరిరక్షణకోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాతృ మరణాలపై సమీక్షించారు. గడిచిన ఏడాది కాలంలో సంభవించిన మాతృ మరణాల కేస్ షీట్స్ పరిశీలించారు. పర్ణశాల, దుమ్ముగూడెం, అశ్వారావుపేట ఆరోగ్యకేంద్రాలలో జరిగిన మరణాలకు కారణాలు సంబంధింత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. గర్భం నిర్ధారణ జరిగిన నాటి నుంచి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, హైరిస్క్ ఉన్న మహిళల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల ప్రమాదం నుంచి రక్షించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సకాలంలో అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించాలని, ప్రసవానికి ఆసుపత్రికి వచ్చిన సమయాల్లో తక్షణమే వైద్యసేవలందించాలని కలెక్టర్ ఆదేశించారు. సీరియస్ అయిన తర్వాత ఇతర ఆసుపత్రులకు సిఫారసు చేస్తున్నారని, దాని వల్ల ప్రమాదం పొంచిఉన్నట్లు చెప్పారు. వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వల్ల మాతృ మరణాలు సంభవిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటింటికెళ్లి ఆరోగ్య పరిరక్షణ జాగ్రత్తలు పాటించే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. మొదటి రెండు దశల్లో వైద్య పరీక్షలు అత్యంత ప్రధానమని, క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఆరోగ్య సమస్యలున్న మహిళలపై నిరంతర పర్యవేక్షణతోనే ప్రాణాపాయం నుంచి రక్షించుకోగలమని చెప్పారు. గర్భిణులను అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు చేర్చేందుకు గ్రామాల్లోని ఆటోలు ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలని, అపుడు మాత్రమే సకాలంలో ఆసుపత్రికి చేర్చగలమని చెప్పారు. అత్యవసర సమయాల్లో ప్రైవేట్ అంబులెన్సులు వినియోగించుకోవాలని సూచించారు. పాల్వంచ, భద్రాచలం ఏరియా ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆసుపత్రుల సమన్వయ అధికారికి సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, ఉప వైద్యాధికారులు డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ సుకృత, భద్రాచలం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామక్రిష్ణ, డాక్టర్ చైతన్య, డాక్టర్ సరళ, డాక్టర్ సింధు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఐటీసీ-ప్రథమ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు

Divitimedia

శ్రీరామనవమి ఏర్పాట్లపై 6న సమీక్ష సమావేశం

Divitimedia

ఆదివాసీ గ్రామంలో సౌకర్యాలు కల్పించాలి : రమణ

Divitimedia

Leave a Comment