నేతల మెడలకు చుట్టుకుంటున్న ‘మద్యం’ పాలసీలు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు, చంద్రబాబుపై సీఐడీ మరో కేసు
✍🏽 కె.ఎన్.ఆర్ – దివిటీ మీడియా
ప్రభుత్వాలకు అతిపెద్ద ఆదాయవనరుగా
మారిపోయిన ‘మద్యం’ తయారీ, అమ్మకాల విషయంలో పాలకులు అమలు చేస్తున్న విధానాలలో కుంభకోణాలు, పలు లోపాలు ప్రభుత్వాధినేతలకు మెడకు చుట్టుకుంటూ ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నుంచి నోటీసులు జారీ కాగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద రాష్ట్ర సీఐడీ విభాగం తాజాగా మరో కేసు నమోదు చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు తాజాగా నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు నవంబర్ 2వ తేదీన విచారణ కోసం హాజరు కావాలంటూ ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఈ కేసులోనే గతంలో సీబీఐ విచారణకు కూడా కేజ్రీవాల్ హాజరయ్యారు. ఢిల్లీ కొత్త మద్యంపాలసీకి సంబంధించిన ఈ కేసులో కేజ్రీవాల్ను విచారణకు పిలిచారు. ఏప్రిల్ 16న సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఈ మద్యంకేసులో ఆయనను తొమ్మిది గంటల సేపు విచారించింది. ఆ సమయంలో అతడికి విచారణకు నోటీసు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇదే మద్యం కేసులో జైలులోనే ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ సోమవారం తిరస్కరణకు గురైంది. అదేరోజు కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు ఇవ్వడం యాదృచ్ఛికంగా జరిగినట్లయింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై రాష్ట్ర సీఐడీ మరో కేసు తాజాగా నమోదు చేసింది. ఇప్పటికే ‘స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్’ కేసులో జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి మీద కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో మద్యం కంపెనీలకు అనుమతుల మంజూరులో అక్రమాలు జరిగాయని కేసు నమోదుచేసిన సీఐడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కూడా విచారించేలా సోమవారం ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులోనే చంద్రబాబు నాయుడితో పాటు అప్పటి ఆ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ శ్రీనరేష్పైన కూడా కేసు నమోదైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గతంలో తెలంగాణలో కూడా ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అక్కడి లిక్కర్ స్కామ్ కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది.