రెండు కార్లలో తరలిస్తున్న రూ.19.5 లక్షల విలువైన 78 కిలోల గంజాయి పట్టివేత
సీలేరు నుంచి హైదరాబాదు తరలిస్తుండగా పట్టుకున్న భద్రాచలం పోలీసులు
ముగ్గురు నిందితుల అరెస్టు, మరో ముగ్గురు పరార్
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
భద్రాచలం పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా బుధవారం (అక్టోబరు 11వ తేదీ) రూ.19.5లక్షల విలువైన 78కిలోల గంజాయి పట్టుకున్నారు. పోలీసులు వెల్లడి చేసిన వివరాలిలా ఉన్నాయి… భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఉత్తర్వుల మేరకు బుధవారం ఉదయం భద్రాచలం కూనవరం రోడ్డులోని రవాణాశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎస్సై పీవీఎన్ రావు సిబ్బంది వాహనాలు తనిఖీ చేశారు. ఆ సమయంలో వరంగల్ కు చెందిన కందిపెల్లి మహేష్, అందాసు హరీష్ బలెనొ కారులో 40 కిలోలు, వెనుక వస్తున్న టాటా ఇండిగో కారులో 38కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. పోలీసు ప్రాథమిక విచారణలో ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులలోని సీలేరు వద్ద మల్కనగిరి జిల్లా చిత్రకొండకు చెందిన సంజీవ్ కుమార్ భట్ర వద్ద గంజాయి కొనుగోలు చేసి, దానిని హైదరాబాదులో విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైంది. టాటా ఇండిగో కారులోని మరో మరో ముగ్గురు నిందితులు కిందకు దూకి పారిపోయారని పోలీసులు వెల్లడించారు. పారిపోయిన వారి వివరాలు తెలుసుకోగా సీలేరుకు చెందిన పంగి బాబు, కూర పూర్ణ, సునీల్ అనేవారుగా తెలిసిందని పోలీసులు వెల్లడించారు. గంజాయి హైదరాబాదులోని ఓల్డ్ సిటీ (పాతబస్తీ)కి చెందిన నందక్క అనే మహిళకు అమ్మేందుకు తీసుకెళ్తున్నట్టుగా నిందితులు నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు వివరించారు. ఈ సంఘటనలో కారు ఓనర్ల మీద కూడా కేసు నమోదు చేశామని, పట్టు బడిన మొత్తం 78 కిలోల గంజాయి విలువ 19.5లక్షలుంటుందని పోలీసులు చెప్పారు. నిందితుల వద్ద నుంచి కార్లతోపాటు రెండు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. భద్రాచలం టౌన్ సీఐ నాగరాజు దర్యాప్తు చేపట్టి, ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు వివరించారు.