తిరుపతిలో భార్య, బావమరిదిని హత్య చేసిన మహారాష్ట్ర వాసి
✍🏽 దివిటీ మీడియా – తిరుపతి
కోట్లాదిమంది భక్తులు కలియుగవైకుంఠంగా భావించే తిరుమల తిరుపతిలో దారుణం జరిగింది. స్థానిక నంది సర్కిల్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో మహారాష్ట్రకు చెందిన అక్కాతమ్ముళ్లు దారుణహత్యకు గురవడం సంచలనం సృష్టించింది. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం పోలీసులు, స్థానికులు అందిస్తున్న వివరాలిలా ఉన్నాయి… మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన యువరాజ్ అనే వ్యక్తికి 12సంవత్సరాల క్రితం మనీషాతో వివాహం జరిగింది. వారికిద్దరు పిల్లలు ఆరు, నాలుగు సంవత్సరాల షక్షమ్, ప్రజ్ఞాన్ ఉన్నారు. ఈ కుటుంబసభ్యులతోపాటు తన బావమరిది హర్షవర్ధన్ తో కలిసి శ్రీవారిదర్శనం కోసమని యువరాజ్ నాలుగురోజులక్రితం తిరుపతికి వచ్చినట్లు సమాచారం. తర్వాత వీరంతా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి నందిసర్కిల్లోని ప్రైవేట్ హోటల్లో గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ, శుక్రవారం తెల్లవారుజామున దాదాపు 2 గంటలసమయంలో యువరాజ్, తనభార్య మనీషా, బావమరిది హర్షవర్ధన్ను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత తమ ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లి యువరాజ్ అలిపిరి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడని తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. ఆ సంఘటన ప్రాంతాన్ని తిరుపతి తూర్పు పట్టణ డీఎస్పీ సురేందర్ రెడ్డి పరిశీలించిన అనంతరం మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అదుపు లోకి తీసుకున్న అలిపిరి పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. కాగా తిరుపతిలో జరిగిన ఈ డబుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త చేతిలో హతమైన మనీషాకు నిందితుడు యువరాజ్ అన్నతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏడాదికాలం నుంచి మనీషా, యువరాజ్ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. రాజీ కుదుర్చుకునేందుకని చెప్పి తన బావమరిది హర్షవర్ధన్, భార్య మనీషాతో పాటు ఇద్దరు పిల్లల్ని యువరాజ్ తిరుపతికి రప్పించినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం నంది సర్కిల్లోని ప్రైవేట్ హోటల్లో రూమ్ నెం.302 లో అద్దెకు దిగారు. అర్థరాత్రి దాటింతర్వాత 2 గంటల సమయంలో ఇద్దరినీ యువరాజ్ హత్య చేశాడని పోలీసులు గుర్తించారు.