‘సఖి’ వన్ స్టాప్ సెంటర్ నూతన భవనం ప్రారంభం
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణంలోని 35వ వార్డులో రూ.48.69లక్షల వ్యయంతో నిర్మించిన సఖి (వన్ స్టాప్ సెంటర్) నూతనభవనాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలకు సఖి కేంద్రంలో అందించే అన్ని విధాలైన రక్షణ, కౌన్సిలింగ్, మధ్యవర్తిత్వం, కుటుంబ సభ్యుల హింస నుంచి రక్షణ, న్యాయసహాయం, సలహాలు తదితర సేవల గురించి వివరించారు. ఈ సాయంతోపాటు అవసరమైన సందర్భంలో ఆశ్రయంకల్పించడం, స్వధార్ కేంద్రం ద్వారా తమ కాళ్ల మీద తాము నిలబడేలా శిక్షణలు సైతం ఇస్తున్నారని చెప్పారు. అభాగ్యులైన మహిళల పాలిట కల్పవృక్షంగా సఖి కేంద్రం సేవలందిస్తోందని, ఈ కేంద్రం 24 గంటలూ పనిచేస్తుందని తెలిపారు. ఆపదలో ఉన్న ఏ మహిళైనా 08744-248222 నెంబరు గానీ, 8688005934 నెంబరుకు గానీ కాల్ చేసి సహాయం పొందవచ్చునని వెల్లడించారు. కేంద్రంలో అందుబాటులో ఉండే సిబ్బంది, ఫోన్ కాల్ వచ్చిన తక్షణమే తగు చర్యలు తీసుకుని బాధితులకు అండగా ఉంటారని చెప్పారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, కుటుంబసభ్యులు లేదంటే భర్త మహిళను మానసికంగా, శారీరకంగా హింసించడం వంటి సంఘటనలతోపాటు, మోసపోతున్న అమ్మాయిలు ఈ సఖి కేంద్రాన్ని ఆశ్రయించి న్యాయ సహాయం పొందాలని చెప్పారు. కేంద్రాకికి వచ్చిన మహిళలకు కౌన్సెలింగ్, వైద్యం, పోలీసు, న్యాయం, వసతులు అనే ఐదు విభాగాలతో సమ్మిళితమైన సాయం ఉంటుందని చెప్పారు. గృహ నిర్బంధం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం వంటి వాటి బారినపడిన బాధితులు సఖి కేంద్రాన్ని ఆశ్రయించాలని చెప్పారు. భార్యా భర్తలిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహణ అనంతరం ఇద్దరి నివేదికలు పరిశీలించి రాజీ చేస్తారని, రాజీ కుదిరిన దంపతులపై ఆరునెలలదాకా సఖి కేంద్రం సిబ్బంది పర్యవేక్షణ చేస్తారని, ఆ కాలంలోనూ సయోధ్య కుదరని పక్షంలో న్యాయ కౌన్సిలర్ ద్వారా, చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత, మున్సిపల్ కమిషనర్ రఘు, కౌన్సిలర్ రుక్మాందర్ బండారి, జాగృతి పీడీ కుముదిని, సీడీపీఓ స్వర్ణలత లెనీనా, సఖి కేంద్రం అడ్మిన్ శుభశ్రీ, లీగల్ కౌన్సిలర్ సునీత, సిబ్బంది పసుమతి, వసంత, శారద, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.