సత్ప్రవర్తనతో మెలగకుంటే కఠిన చర్యలు తప్పవు
రౌడీషీటర్లకు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ కౌన్సెలింగ్
✍🏽 దివిటీ మీడియా – చర్ల, భద్రాచలం
రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ నేరాలకు పాల్పడితే జైలుజీవితం తప్పదని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. బుధవారం ఆయన చర్ల పోలీసుస్టేషన్ ఆవరణలో ఆ మండలంలోని రౌడీషీటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సమాజంలో గౌరవప్రదంగా మెలగాలని, తద్వారా మంచివారిగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు అనుభవించాల్సి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇకనుంచి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండి సమాజంలో సముచితస్థానంలో నిలిచేలా గౌరవప్రదంగా మెలగాలని ఆయన హితవు పలికారు. ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, చట్టపరంగా జైలు జీవితం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ బి.రాజగోపాల్, ఎస్సైలు టీవీఆర్ సూరి, వెంకటప్పయ్య, నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.