జిల్లాలో ఇసుక అక్రమరవాణా పూర్తిగా అరికట్టాలి
జిల్లా ‘ఇసుక కమిటీ’ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅల సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం (సెప్టెంబర్ 23వ తేదీ) ఐడీఓసీ మిని సమావేశ మందిరంలో నిర్వహించిన డిస్ట్రిక్ లెవల్ స్యాండ్ కమిటీ సమావేశంలో ఆమె ఇసుక అక్రమ రవాణా నియంత్రణ చర్యలు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేదిశగా చేపట్టవలసిన చర్యలపై మైన్స్, ఆర్అండ్బి, ఇరిగేషన్, టిఎస్ఎండిసి, మున్సిపల్, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్, రెవెన్యూ, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గోదావరి, కిన్నెరసాని నదులకు సంబంధించి మండలాల్లో నిర్వహిచబడుతున్న ఇసుక రీచ్ల నుంచి జిల్లాలో ఇసుక రవాణా కోసం రెవెన్యూశాఖ గుర్తించిన వాహనాల ద్వారా మాత్రమే నియమనిబంధనల పరిధి లోబడి నిర్మాణాలకు ఇసుక విక్రయించాలన్నారు. జిల్లాలోని ఇసుక రీచ్లలో ఇసుక లభ్యత, నిల్వలపై తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఎట్టి పరిస్థితులలో ఇసుక అక్రమరవాణా జరుగరాదన్నారు. ఆ దిశగా పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఒకే కూపన్ ద్వారానే జరిగే అక్రమరవాణా పూర్తిగా అరికట్టేలాగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, సి.సి కెమెరాల నిఘాతో వాహనాలు తనిఖీచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వపరంగా జరిగే నిర్మాణాలైన సి.సి రోడ్లు, డబుల్ బెడ్రూమ్ గృహాలు, చిన్న తరహా కట్టడాలకు స్థానిక అవసరాలకు ఇసుక కొరత ఏర్పడకూడదని కలెక్టర్ తెలిపారు. అక్రమ రవాణా జరిపే వాహనాలపై జరిమానాలను విధించాలని, ఇసుక రవాణాకు నిర్దేశించిన సమయాన్ని ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రధానంగా రాత్రివేళల్లో ఇసుకరవాణాను పూర్తిగా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చర్చలతోపాటు జి.పి.ఎస్ విధానం అమలు చేయడం ద్వారా ఇసుక అక్రమరవాణాను పూర్తిగా నియంత్రించగలుగుతామని, దానికి అవసరమైన చర్యలను చేపట్టాలని కలెక్టర్ అన్నారు. అదేవిధంగా జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలపై కూడా నిఘా పెంచాలని, ప్రభుత్వ స్థలాలున్న గుట్టలను తహశీల్దార్లు గుర్తించి అక్రమ మట్టి త్రవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా పంచాయితీ అధికారి, జిల్లా నీటిపారుదలశాఖ అధికారి, కలెక్టరేట్ ఎ.ఒ, మైనింగ్ ఎ.డి, ఆర్.అండ్.బి, పంచాయితీ రాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, మండలాల తహశీల్దార్లు, ఎస్.హెచ్.ఓలు, తదితరులు పాల్గొన్నారు.