రేపే తొమ్మిది వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రారంభోత్సవం
కొత్త వందే భారత్ రైళ్లకు జెండా ఊపనున్న ప్రధాని మోదీ
పదకొండు రాష్ట్రాల్లో తిరుపతి, మధురై, పూరి వంటి ప్రదేశాలకు పెరుగుతున్న కనెక్టివిటీ
పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం
✍🏽 దివిటీ మీడియా – న్యూఢిల్లీ
దేశంలో పదకొండు రాష్ట్రాలలో పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేలా ఆదివారం (సెప్టెంబర్ 24) తొమ్మిది వందేభారత్ రైళ్లను కేంద్రప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ రైళ్ల ప్రయాణాన్ని దేశప్రధానమంత్రి నరేంద్రమోదీ
సెప్టెంబర్ 24 మధ్యాహ్నం 12-30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెండా ఊపి ‘వర్చువల్’గా ప్రారంభించనున్నారు. ఈ కొత్త వందేభారత్ రైళ్లు ప్రధాని నరేంద్రమోదీ కల సాకారం చేసే దిశగా, దేశవ్యాప్త కనెక్టివిటీని మెరుగుపరచడం, రైలు ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను అందించడం కోసం ఈ కొత్త రైళ్లు రానున్నాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ తొమ్మిది రైళ్లతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, బీహార్, పశ్చిమబెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో కనెక్టివిటీ పెరగనుంది. వేగవంతమైన వందే భారత్ రైళ్లతో ప్రయాణికులకు సమయం గణనీయంగా ఆదా అవుతుంది. తొమ్మిది వందేభారత్ రైళ్లలో అన్నిటికంటే వేగవంత మైన రైలుగా ‘రూర్కెలా- భువనేశ్వర్ పూరి’ వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి చెప్తున్నారు. దేశవ్యాప్తంగా మతపరమైన ముఖ్యమైన ప్రదేశాలకు కూడా కనెక్టివిటీ పెరుగనుంది. విజయవాడ, తిరుపతి, మధురై, పూరి వంటి క్షేత్రాలకు దేశం నలుమూలల నుంచి రాకపోకలు పెరుగనున్నాయి.
ఉదయపూర్-జైపూర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్.
తిరునెల్వేలి-మధురై-చెన్నై వందేభారత్ ఎక్స్ ప్రెస్.
హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ ఎక్స్ ప్రెస్.
విజయవాడ- రేణిగుంట-చెన్నై వందేభారత్ ఎక్స్ ప్రెస్.
పాట్నా- హౌరా వందేభారత్ ఎక్స్ ప్రెస్.
కాసరగోడ్-తిరువనంతపురం వందేభారత్ ఎక్స్ ప్రెస్.
రూర్కెలా-భువనేశ్వర్-పూరి వందేభారత్ ఎక్స్ ప్రెస్.
రాంచీ- హౌరా వందేభారత్ ఎక్స్ ప్రెస్
జామ్నగర్-అహ్మదాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్.