Divitimedia
Crime NewsInternational NewsNational News

ఉగ్రవాద సంబంధిత కేసులో కాశ్మీరులో డీఎస్పీ అరెస్టు

ఉగ్రవాద సంబంధిత కేసులో కాశ్మీరులో డీఎస్పీ అరెస్టు

✍🏽 దివిటీ మీడియా – న్యూఢిల్లీ

ఉగ్రవాద కార్యకర్తతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై జమ్మూ కాశ్మీర్ లో ఓ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అధికారులు వెల్లడించిన ఆ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. డీఎస్పీ షేక్ ఆదిల్ ముస్తాక్ ఒక ఉగ్రవాద కార్యకర్తకు అరెస్టు నుంచి తప్పించుకునేలా సాయం చేశాడని, ఆ నిందితుడిని విచారణ చేస్తున్న ఒక పోలీసు అధికారిని ఇరికించే ప్రయత్నం చేయడంతో పాటు, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. అతడిని శ్రీనగర్‌లోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, ఆరురోజులపాటు పోలీసు కస్టడీకి పంపారు. జులైలో అరెస్టైన ఉగ్రవాద నిందితుల ఫోన్ డాటా విశ్లేషించడంతో ఈ విషయాలు బయటపడినట్లు అధికారులు చెప్తున్నారు. డీఎస్పీ ఆదిల్ ముస్తాక్ తనతో నిరంతరం టచ్‌లో ఉన్నాడని, ఆయన తనకు మార్గనిర్దేశం చేశారని ఉగ్రవాద కేసు నిందితుడు దర్యాప్తులో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఓ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఆదిల్ ముస్తాక్ టెలిగ్రామ్ యాప్‌లో నిందితులతో మాట్లాడేవాడు. “ఉగ్రవాద నిందితుడికి, ఆ డీఎస్పీకి మధ్య కనీసం 40కాల్స్ ఉన్నాయని, అరెస్టు నుంచి తప్పించుకోవడం ఎలాగనేదానిపై అతనికి
న్యాయ సహాయంకోసం మార్గనిర్దేశం కూడా చేస్తున్నాడని” దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఓ అధికారి వెల్లడించారు. దీని ఆధారంగా ఆ అధికారిపై పోలీసులు వాటర్‌టైట్ కేసు పెట్టారని తెలిపారు. సాంకేతికసాక్ష్యాలతో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఉగ్రవాద నిందితులకు సహాయం చేస్తున్న ఆదిల్ ఒక పోలీసు అధికారిని కూడా కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడని తెలిపారు. ‘తీవ్రవాదుల నిధుల (టెర్రర్ ఫండింగ్) కేసులో దర్యాప్తు అధికారిని ఇంప్లీడ్ చేయడానికి, ఆ డీఎస్పీ టెర్రర్ నిందితుడి తరపున ఒక తప్పుడు ఫిర్యాదు కూడా రూపొందించిన విషయాన్ని గుర్తించారు. ‘ఉగ్రవాద నిధుల కేసులో గత ఫిబ్రవరిలో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు’ అని ఆయన చెప్పారు. నిందితుల నుంచి ఆదిల్ ముస్తాక్ రూ.5లక్షలు తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. లష్కర్ ఫైనాన్స్‌ల నిర్వహణ కోసం సోపోర్‌లో నకిలీ పత్రాలపై బ్యాంకు ఖాతాను తెరిచిన ముజామిల్ జహూర్‌తో కూడా అతను సన్నిహితంగా ఉన్నాడని ఒక అధికారి తెలిపారు. గడిచిన
ఫిబ్రవరిలో శ్రీనగర్ పోలీసులు ముగ్గురు లష్కర్ కార్యకర్తలను అరెస్టుచేసి, వారి వద్ద నుంచి రూ.31లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారంగీకరించిన వివరాల ఆధారంగా, ఆదిల్ ముస్తాక్ సహాయంతో చట్టం నుంచి తప్పించుకున్న ముజామిల్ జహూర్ కోసం పోలీసులు వెతికారు. ఈ కేసులో అరెస్టైన అధికారికి వ్యతిరేకంగా ‘దోపిడీ, బ్లాక్‌మెయిల్‌’కు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఉన్నాయని, అతనికి వ్యతిరేకంగా వస్తున్న ఆ ఫిర్యాదులన్నింటిని విచారిస్తున్నామని ఆ అధికారి తెలిపారు.
ఉగ్రవాదులతో సంబంధాల ఆరోపణలపై ఓ ఉన్నతాధికారిని అరెస్టు చేయడం గడిచిన మూడేళ్లలో ఇది రెండోకేసు కావడం విశేషం. 2020లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి, వారిని ఢిల్లీకి చేరవేసినందుకు దేవిందర్ సింగ్ అనే మరో డీఎస్పీని అరెస్టు చేయగా, ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఆదిల్ ముస్తాక్ గతకొన్ని సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ పోలీసుల్లో ఎక్కువ ప్రచారంలో ఉన్నవారిలో ఒకరుగా చెప్తున్నారు. ‘సూడో-జాతీయవాదం’ ముసుగు వేసుకుని అతను దోపిడీ రాకెట్‌ నడుపుతున్నట్లు చెబుతున్నారు. ‘గతంలో మహిళలను దోపిడీచేయడం, బ్లాక్‌మెయిల్ చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న అతను వాటి నుంచి తప్పించుకోగలిగాడు’ అని ఒక అధికారి తెలిపారు. ప్రత్యేకమైన ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తుబృందం ఏర్పాటు చేశారు. ఆదిల్ ముస్తాక్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Related posts

సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల

Divitimedia

మద్యం బెల్టుషాపుల నిర్వాహకులు 32మంది బైండోవర్

Divitimedia

ముక్కోటి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

Divitimedia

Leave a Comment