హైదరాబాదు-బెంగళూరు మధ్య వందేభారత్
ఈనెల 24నుంచి పరుగులు పెట్టనున్న రైలు
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు
ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ‘వందేభారత్ రైలు’ ఈనెల 24నుంచి రెండు దక్షిణాది రాష్ట్రాల రాజధాని నగరాల మధ్య పరుగులు పెట్టనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్, కర్ణాటక రాజధాని బెంగళూరు నడుమ ఈ మేరకు గురువారం ట్రయల్ రన్ చేస్తున్నారు. ఈ రైలును దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 24న వర్చువల్ గా ప్రారంభించనున్నారు. హైదరాబాదు నుంచి బెంగుళూరు మధ్య మొత్తం 610కిలోమీటర్ల దూరాన్ని 8-30గంటల్లో ప్రయాణించనుంది. సగటున 71కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ఈ రైలు హైదరాబాదులోని కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 5-30గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 2గంటల లోపున యశ్వంత్ పూర్ స్టేషన్ చేరుతుంది. మరలా మధ్యాహ్నం 2-45గంటలకు బెంగళూరులో బయలుదేరి రాత్రి 11-15 గంటలకు హైదరాబాదు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు నడుస్తుందని వివరించారు. హైదరాబాదు- బెంగళూరు నడుమ మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురము, డోన్, ధర్మవరం స్టేషన్లలో మాత్రమే ఈ వందేభారత్ రైలుకు స్టాప్ ఉంటుంది. మొత్తం 16 బోగీలు ఉండే ఈ రైలు నిర్వహణ బాధ్యత కాచిగూడలో దక్షిణమధ్య రైల్వే అధికారులు చూస్తారు. ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాల రాజధాని నగరాల నడుమ సూపర్ ఫాస్ట్, రాజధాని, మెయిల్ ఎక్స్ ప్రెస్, వంటి మొత్తం 20 రైలు సర్వీసులున్నాయి. రెండు నగరాల మధ్య సగటు ప్రయాణసమయం 12 గంటలని, ఈ వందేభారత్ వల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుందని దక్షిణమధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు తెలిపారు.