విద్యార్థుల సామర్థ్యాలు సరిగ్గా అంచనా వేయాలి : ఐటీడీఏ పీఓ
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
పంట పండించే రైతు విత్తనాలు చల్లి, అవి మొక్కలయిన తర్వాత వాటికి నీరు పోసి, ఎదగడానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటాడో గిరిజన విద్యార్థిని విద్యార్థుల సామర్ధ్యాలు అంచనా వేసి వెలికితీసి వారి విద్యాభివృద్ధి కోసం కూడా సంబంధిత ఉపాధ్యాయులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ కోరారు. అందుకు తగిన ప్రణాళికలతో రూపొందించిన యాప్ ద్వారా గురుకులం ప్రిన్సిపాల్స్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థుల కనీస సామర్థ్యం తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఐటీడీఏ సమావేశమందిరం నుంచి శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకులం పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల ప్రిన్సిపాల్స్, హెచ్ఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల కనీస సామర్ధ్యాల అంచనా కార్యక్రమం నిర్వహణ గురించి పీఓ పలు సూచనలు, సలహాలు అందజేశారు. 2021 సర్వే ప్రకారం కరోనా ప్రభావం వల్ల గురుకులం, గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల చదువు చాలా వెనుకబడిపోయి ఉందని తెలిపారు. సాధ్యమైనంతవరకు ఈ పిల్లల చదువు కోసం ఉపాధ్యాయులు పలు రకాల పద్ధతుల్లో వారికి చదువుపై మక్కువ కలిగించారన్నారు. అయినప్పటికీ మూడవ తరగతి నుంచి ఏడవతరగతి చదువుతున్న పిల్లలు అక్షరాలు చదవడంలో కూడా చాలా తడబడుతున్నారనేది కొన్నిచోట్ల గుర్తించిన విషయాన్ని పీఓ వెల్లడించారు. అటువంటి విద్యార్థుల కోసమే రూపొందించిన ప్రత్యేక కార్యక్రమంపై హెచ్ఎంలు, గురుకులం ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అమలు చేయాలని కోరారు. ఈ ఉపాధ్యాయులు ఒక్కొక్కరు 50 మంది పిల్లలను ఎంచుకుని, ఆరుబయట బ్లాక్ బోర్డు ఏర్పాటు చేయించి ఒక్కొక్క విద్యార్థిని పిలిచి ప్రత్యేక యాప్ లో చూపించిన విధంగా లెటర్స్, పేరా, స్టోరీలు, ప్రపంచానికి సంబంధించిన పలు అంశాలు ఒక్కొక్కటిగా పిల్లలకు నేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారనేది యాప్ లో పొందుపరచాలని తెలిపారు. బాల బాలికలు తప్పనిసరిగా తెలుగు, ఇంగ్లీషు, గణితం, సబ్జెక్టులపై ఉన్న అంశాలు చదవడం రాయడం తప్పనిసరిగా రావాలన్నారు. ముందు పిల్లల మానసిక స్థితి ఎలా ఉన్నదనేది ప్రతి ఉపాధ్యాయుడు తెలుసుకోవాలని, వారు రోజువారి దినచర్య గురించి కరెక్టుగా చెప్పేవిధంగా, అక్షరాలను కూడా గుర్తించే విధంగా చూడాలన్నారు. ప్రతి విద్యార్థి ఐదు అంశాల్లో తప్పనిసరిగా మెరుగుపడే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు పిల్లలతో స్నేహంగా ఉంటూ వారికి నచ్చేలా పాఠ్యాంశాలు బోధించాలని ఐటీడీఏ పీఓ కోరారు. భవిష్యత్తులో గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇదొక మంచి అవకాశమని, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, నిర్దేశించిన మూడు రోజులపాటు విద్యార్థుల కనీస సామర్థ్యాల అంచనా కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా వందరోజుల ప్రణాళిక రూపొందించి అందుకు సంబంధించి మెటీరియల్ వచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సూచనల మేరకు ప్రణాళికలననుసరించి సరఫరా చేసే మెటీరియల్ ద్వారా పదవ తరగతి పిల్లలకు తప్పనిసరిగా ఈ వంద రోజుల ప్రణాళికలో ప్రత్యేక జాగ్రత్తలతో వారి విద్యను అభివృద్ధి పరిచే విధంగా చూడాలని పీఓ కోరారు. ఈ క్రమంలో ఏపీవో జనరల్ ఇన్చార్జి ఆర్ సి ఓ గురుకులం డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ,ఏసీఎంవో రమణయ్య, జిసిడివో అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.
