భారీగా కల్తీ వంటనూనె పట్టివేత

✍🏽 దివిటీ మీడియా – ఆన్ లైన్
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(కేంద్ర ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ-ఎఫ్ఎస్ఎస్ఎఐ) పశ్చిమ రీజియన్ అధికారులు బుధవారం సాయంత్రం ఏకంగా 35 టన్నుల కల్తీ వంట నూనె స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ కల్తీ వంటనూనె మార్కెట్ అంచనా విలువ రూ.82.45 లక్షలుగా అధికారులు చెప్తున్నారు. ముంబైలోని వాషి ప్రాంతంలో క్రైమ్ బ్రాంచ్ యూనిట్-1 నుంచి అందిన సమాచారంతో అదే ప్రాంతంలోని ఒక ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ (ఎఫ్.బి.ఒ) ప్రాంగణంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ
ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్స్లో కల్తీకి పాల్పడుతున్నట్లు అధికారుల బృందం గుర్తించింది. అనుమానాస్పద పదార్థాలను ఉపయోగించి కల్తీనూనె తయారీ, ప్యాకింగ్ చేస్తున్నారనే అనుమానంతో, మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఎడిబుల్ఆయిల్ నమూనాలు సేకరించారు. అక్కడ మిగిలిన స్టాక్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో వేరుశెనగ నూనె, ఆవాల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె, పామాయిల్ మొదలైన రకాల నూనెలుండటం విశేషం. ఈ సంఘటనతో మార్కెట్ లో కల్తీ వంట నూనెల విక్రయాలు ఏమేరకు ఉన్నాయనేది తేటతెల్లమవుతోంది. ప్రజలు వంటనూనెలు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎఫ్ఎస్ఎస్ఎఐ అధికారులు సూచిస్తున్నారు.

