ఐసీడీఎస్ లో ‘ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్’ దే పైచేయి
‘అక్రమాల సీడీపీఓ’ కే అధికారుల అండదండలు
‘జబ్బు ఒకటైతే… వైద్యం వేరొకటి’ గా మారిన చర్యలు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
“కుడికన్నులో సమస్యకు, ఎడమ కంటికి ఆపరేషన్ చేశాడంట” ఓ వైద్యుడు… దీంతో చూపు మొత్తం పోయిందంట… సరిగ్గా ఇదే దుస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐసీడీఎస్ లో ఉందనే విమర్శలు వస్తున్నాయి. మహిళా, శిశు సంక్షేమశాఖలో ‘ఆటవిక న్యాయం’ రాజ్యమేలుతోంది. అక్రమార్కుల ఇష్టారాజ్యంగా మారిపోతోంది. ‘ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్’ను అస్త్రంగా మార్చుకుని చెలరేగిపోతున్న కొందరు అక్రమార్కుల వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐసీడీఎస్ పక్క దారి పట్టింది. ఈ జిల్లాలో అవినీతి, అక్రమ వ్యవహారాలకు మారుపేరుగా తయారైన ఆ శాఖను ‘ప్రక్షాళన చేయాలనే’ ప్రయత్నంలో ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలు కూడా పక్కదారి పడుతున్నాయి. జిల్లాలోని పరిస్థితులు చూస్తే అక్రమార్కులకే అత్యంత విలువ ఉందని నిరూపిస్తున్నాయి. ఏడాది కాలంలోనే ఎన్నెన్నో వివాదాలతో ఈ జిల్లా ఐసీడీఎస్ పనితీరు భ్రష్టుపట్టిపోతోంది. ఒక ఏడాదికాలంలోనే ఇక్కడ అధికారుల మధ్య ‘అంతర్గత ఆధిపత్యపోరు’ పతాకస్థాయిలో చేరింది. ఈ జిల్లాలో ఐసీడీఎస్ పర్యవేక్షణ చేసే అధికారులు, తమ మధ్య నెలకొన్న విబేధాలతో ఆధిపత్యపోరును పెద్దదిచేస్తూ, అసలు పనిని గాలికొదిలేశారు. ఈ జిల్లాలో ఉన్నతాధికారుల అండదండలతో ఐదేళ్లకు పైగా డెప్యుటేషన్ పై తిష్టవేసుకు కూర్చున్న ఓ సీడీపీఓ, తన అక్రమాలు బయటపెట్టేలా ప్రయత్నాలు చేస్తున్న అధికారులపై ఎదురు దాడి చేస్తున్నారు. తన అవినీతి, అక్రమాలు ఏమాత్రం బయటకు రాకుండా ఉండేందుకు ‘ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్’ ప్రయోగించి ‘ఆత్మరక్షణ’ చేసుకుంటున్నారు. తన మీద చర్యలకోసం ఉన్నతాధికారులు ప్రయత్నం చేస్తున్నారని తెలిసిన మరుక్షణమే యాక్షన్ మొదలుపెట్టి, వ్యవహారం మొత్తం పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు ఆమె. తనపై కక్షగట్టి కావాలనే ఇలా చేస్తున్నారనే ప్రచారంతో ఆ మొత్తం వ్యవహారం పక్కదారి పట్టేవిధంగా ఉన్నతాధికారులకు లేనిపోనివి కల్పించి చెప్పడం ఆమె ప్రత్యేకత. అవసరం అయితే ఉన్నతాధికారుల వద్ద భోరుమని ఏడవడం, తన వ్యక్తిగత విషయాలు, తన కష్టాలతో సినిమా చూపించి, సానుభూతిని పొందడం ఆమెకు వెన్నతో పెట్టినవిద్య అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తూ, ఇటీవల ‘దివిటీ మీడియా’ కథనాలు రాస్తూ ఉండటంతో, చర్యల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె, ఉన్నతాధికారులనూ తప్పుదారి పట్టిస్తున్నారు. ఐసీడీఎస్ లోనే కొందరు ఉన్నతాధికారులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేయం ద్వారా వారి మానసిక స్తైర్యం దెబ్బ తీసేవిధంగా ‘రివర్స్ ప్రచారం’ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ సీడీపీఓ నోటికి భయపడి ఉన్నతాధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేక నిస్సహాయంగా ఉండిపోతున్న దుస్థితి ఏర్పడింది. కొత్తగూడెం సీడీపీఓగా ఉన్న స్వర్ణలతలెనినాను కలెక్టర్ ‘ఇన్ ఛార్జ్ డీడబ్ల్యుఓ’ గా నియమించగానే ఆమెకు వ్యతిరేకంగా సదరు వివాదాస్పద సీడీపీఓ, దుష్ప్రచారం మొదలుపెట్టారు. గతంలోనే ఇన్ ఛార్జ్ డీడబ్ల్యుఓగా రెండు జిల్లాల్లో పని చేసిన అనుభవమున్న స్వర్ణలతలెనినా, ఆ సీడీపీఓ మీద వచ్చిన ఆరోపణలపై ఎక్కడ విచారణ చేస్తారోననే భయంతోనే ఆమె ఈ విధంగా దుష్ప్రచారం మొదలు పెట్టారని తెలుస్తోంది. ఐసీడీఎస్ రాష్ట్రస్థాయి ఉన్నత అధికారుల సూచనల మేరకు జిల్లా కలెక్టర్ డా ప్రియాంకఅల స్వర్ణలతలెనినాను జిల్లా అధికారి బాధ్యతల నుంచి తప్పించారు. ఆ స్థానంలో ఐసీడీఎస్ లో అనుభవం లేని ఓ జూనియర్ అధికారిని నియమించారు. ఆ సీడీపీఓపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలపై మాత్రం ఐసీడీఎస్ రాష్ట్ర ఉన్నతాధికారులు గానీ, జిల్లాకలెక్టర్ గానీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ జిల్లాలోని పరిస్థితులను పూర్తిగా తెలుసుకోకుండానే ఆ సీడీపీఓ విసిరిన ‘ట్రాప్’లో పడిపోయిన రాష్ట్ర ఉన్నతాధికారులు తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా ఐసీడీఎస్ పర్యవేక్షణ మరింత ఘోరంగా దిగజారబోతున్నట్లు ఆ శాఖ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. డీడబ్ల్యుఓ బాధ్యతల మార్పు విషయంలో ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ‘కొండనాలుకకు మందు వేసిన’ చందంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ జిల్లాలో ఐదేళ్లకుపైగా డెప్యుటేషన్ మీద కొనసాగుతున్న ఆ వివాదాస్పద, అవినీతి సీడీపీఓ గురించి సమగ్ర విచారణ జరిపించి కఠినచర్యలు తీసుకోకపోతే మాత్రం ఆమె ప్రభావంతో ఐసీడీఎస్ మరింత ఘోరంగా దిగజారడం ఖాయంగా కనిపిస్తోంది.