జిల్లాలో ఓటరు జాబితాలో సవరణలకు 6,418 దరఖాస్తులు
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఓటరు జాబితాల సవరణ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6,418 దరఖాస్తులు వచ్చినట్లుగా జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల పేర్కొన్నారు.
2023 అక్టోబరు 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులు నూతన ఓటరుగా నమోదు కావడం, మరణించిన ఓటర్లను జాబితా నుండి తొలగించడం, పోలింగ్ కేంద్రం కానీ, చిరునామా కానీ మార్చుకోవడం, ఇతర మార్పులు, చేర్పుల కోసం 26, 27 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కొత్తగా ఓటుహక్కు నమోదు కోసం 4041, తొలగింపు కోసం 557, మార్పులు చేర్పుల కోసం 1820 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రత్యేక క్యాంపులలో వచ్చిన దరఖాస్తుల విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని తహసిల్దారులను ఆదేశించారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లోని 1095 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించామని చెప్పారు. ఇంకా ఎవరైనా వచ్చే అక్టోబరు 1 నాటికి 18 సంవత్సరాలు నిండే వారుంటే నూతన ఓటరుగా నమోదు కావాలని చెప్పారు. ఈ నెల 21వ తేదీన ప్రకటించిన ఓటరు జాబితా ప్రతి ఓటరు పరిశీలించాలని, ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని పేర్కొన్నారు. వచ్చే నెల (సెప్టెంబరు) 2వ తేదీ శనివారం, 3వ తేదీ ఆదివారం నిర్వహించనున్న ప్రత్యేక క్యాంపులపై ప్రతి ఒక్కరికి సమాచారం చేరేలా అన్ని గ్రామాలు, మున్సిపాల్టీలలో టామ్… టామ్ ద్వారా విస్తృత ప్రచారం చేయించాలని కలెక్టర్ మండల అధికారులను ఆదేశించారు.
