‘డీడబ్ల్యుఓ’గా మరోసారి స్వర్ణలతలెనినాకు బాధ్యతలు
విధుల్లో నిర్లక్ష్యంతో సబితను సరెండర్ చేసిన కలెక్టర్
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ అధికారి (డి.డబ్ల్యు.ఒ) గా ఐసీడీఎస్ కొత్తగూడెం సీడీపీఓ జె.ఎం.స్వర్ణలతలెనినాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆదేశాల మేరకు స్వర్ణలతలెనినా గురువారం సాయంత్రం జిల్లా సంక్షేమాధికారిగా పూర్తి అదనపు బాధ్యత స్వీకరించారు. గత మే నెలలో ఈ జిల్లాకు బదిలీపై వచ్చి డీడబ్ల్యుఓగా పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం.సబితను జిల్లా కలెక్టర్ ప్రియాంక సరెండర్ చేశారు. సబిత జిల్లా సంక్షేమ అధికారిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేకపోతుండటం వల్ల జిల్లాలో పరిపాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2021-2022 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో ప్రతి ఏడాదికి 40వేల చొప్పున దేశంలోని మొత్తం 2లక్షల అంగన్వాడీ కేంద్రాలను ‘సాక్షం అంగన్వాడీ’ లుగా అప్గ్రేడ్ చేసేలా నిధులు మంజూరు చేస్తోంది. ఆ పథకంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 350 అంగన్వాడీ కేంద్రాలు ‘సాక్షం అంగన్వాడీలు’గా అప్గ్రేడ్ చేయడం కోసం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు
జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాలలో పోషణ వాటిక, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఆర్ఓ యూనిట్లు, ఎల్ఈడీలు తదితర మౌలిక సదుపాయాల పనులు చేపట్టాల్సి ఉండగా డీడబ్ల్యుఓ బాధ్యత కలిగిన సబిత ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని కలెక్టర్ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా గత జూన్ నెల నుంచి అంగన్ వాడీ కేంద్రాల్లో పోషకాహారం కోసం కందిపప్పు సరఫరాలో ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత కూడా సబిత విస్మరించారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి ఏజెన్సీల నుంచి కందిపప్పు సరఫరా లేకపోవడంతో నిర్దేశించిన ధరల ప్రకారంగా జిల్లాలో డీపీసీ అనుమతితో స్థానికంగానే కందిపప్పు కొనుగోలు చేసి అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉందని తన ఆదేశాల్లో కలెక్టర్ తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ విధానంలో కందిపప్పు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని కలెక్టర్ ఆదేశాల్లో పేర్కొన్నారు. జూన్, జూలై నెలల్లో జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాలలో చిన్నారులకు నిత్యం ఆహారం అందడంలో ఇబ్బందులు తలెత్తాయని, జిల్లా పరిధిలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయాలలో కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొందని ఆ ఆదేశాల్లో వెల్లడించారు. డీడబ్ల్యుఓ హోదా కలిగిన సబిత విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని గుర్తించి, ఆమెను మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేస్తున్నట్లు కలెక్టర్ డా.ప్రియాంక ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈపరిస్థితుల్లో జిల్లా సంక్షేమాధికారిగా కొత్తగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ జె.ఎం.స్వర్ణలతలెనినాకు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు చేపట్టారు. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ నియామకం అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక పేర్కొన్నారు.