కమ్యూనిస్టులకు ‘చెయ్యి’చ్చిన కారు ఓనరు
తెలంగాణలో ఏకం కాబోతున్న ప్రతిపక్షాలు… ?
పొత్తులపై ప్రత్యామ్నాయం వెతుక్కోక తప్పని కామ్రేడ్లు
✍🏽 కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ మీడియా
‘మబ్బులను చూసి ముంత ఒలక బోసుకున్నంత …’ పనైంది. అధికార పార్టీతో చెట్టపట్టాలేసుకోవాలనుకున్న పార్టీల నాయకులకు ఊహించని రీతిలో ఆ పార్టీ అధినేత ‘షాక్’ ఇచ్చారు. ప్రగతిభవన్ నుంచి పిలుపురాక కోసం ఎదురుచూస్తున్న కామ్రేడ్లకు అక్కడ జాగా లేదనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పటం కేసీఆర్ కే సాధ్యమైంది. ఆపదలో ఉన్నప్పుడు చెప్పిన మాట పట్టుకుని ‘దోస్తీ’పై ఆశలు పెట్టుకున్న కమ్యూనిస్టులకు నిరాశ కలిగించారు కారు అధినేత కేసీఆర్. కారులో తిరిగేందుకు తమ కుటుంబసభ్యులకే చోటు సరిపోక తామే సర్దుబాటు చేసుకుంటుంటే చుట్టాలు కూడా రావడానికి చోటు లేదనే విషయాన్ని చెప్పకనే స్పష్టంగా చెప్పిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వైఖరి కమ్యూనిస్టులకు శరాఘాతంలా తగిలింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అధికార బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేసిన ఉమ్మడి వామపక్షాలకు ప్రత్యామ్నాయం వెతుక్కోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఎన్నికలకింకా ముహూర్తం కూడా ఖరారుకాకముందే సీఎం కేసీఆర్ తమ పార్టీ నుంచి పోటీ చేసే 115 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఇంక కొత్త పొత్తులకు అవకాశమే లేదనేది స్పష్టం చేసినట్లయింది. పాత మిత్రులుగా ఉన్న ఎంఐఎం తప్ప మరెవరితోను తమకు ఎన్నికల పొత్తు అవసరం లేదనే విషయాన్ని కేసీఆర్ కాస్త కటువుగానే చెప్పినట్లయింది. సోమవారం(ఆగస్టు 21) బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితా ప్రకటించడం తెలిసిందే. రాష్ట్రంలో తమ ప్రభావం ఇంకా బలంగానే ఉందని నమ్మకంతో ఉన్న సీపీఐ, సీపీఎం నాయకులు బీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి పొత్తుల చర్చల పిలుపుకోసం కొంత కాలంగా వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి ఎంతకూ తమ నాయకులకు పిలుపు రాకపోవడంతో కాస్త అనుమానంగానే ఉన్న కార్యకర్తలు కేసీఆర్ వైఖరి గురించి గుర్రుగా ఉన్నారు. ఖమ్మంలో మాజీ కామ్రేడ్, ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నోటితో ‘కమ్యూనిస్టులకు అంతగా బలం లేదంటూ’ వచ్చిన మాటలను తేలికగా తీసుకున్నారు. ఆ తర్వాత తాజాగా బీఆర్ఎస్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా ఉండే మంత్రి హరీష్ రావు కూడా ఇటీవల కమ్యూనిస్టుల బలాన్ని తక్కువ చేసి మాట్లాడటంతో కాస్త నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ నుంచి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాస్త ఘాటుగానే స్పందించినప్పటికీ సోదరులు సీపీఎం నుంచి ఆస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పట్ల ‘కౌంటర్’ రాలేదు. కాస్త హడావుడితో ఆ వ్యవహారం సద్దుమణిగినప్పటికీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోటి నుంచి పొత్తులమాట స్పష్టంగా వచ్చేవరకు వేచి చూడాలనుకున్న కమ్యూనిస్టులకు తాజాగా స్పష్టత వచ్చింది. పొత్తుల గురించి చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేత నుంచి పిలుపు కోసం కమ్యూనిస్టు నాయకులు ఎదురు చూస్తుంటే ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఏకంగా 115అసెంబ్లీ స్థానాల్లోను పార్టీ అభ్యర్థులను ప్రకటించడం విశేషం. దీంతో బీఆర్ఎస్ పార్టీతో తమకింక పొత్తులేదనే విషయం కమ్యూనిస్టుపార్టీలకు స్పష్టంగా తేలిపోయింది. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ సాయంతో గెలిచిన వెంటనే తమ ప్రయాణం మున్ముందు కూడా కలిసి సాగుతుందంటూ మంత్రి జగదీష్ రెడ్డి నోటి వెంట పలికించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఇంతకాలం ఆ విషయం ప్రస్తావన తీసుకురాకపోవడంతో కామ్రేడ్లు పొత్తులపై కాస్తంత అనుమానంతోనే ఉన్నారు. అందు వల్లనే ప్రగతిభవన్ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్లు కాస్త సీరియస్ గానే సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో కామ్రేడ్లకు ఒక్కసారిగా ‘ఝలక్’ ఇచ్చిన కేసీఆర్ వైఖరి నిరాశపరిచి ఉండవచ్చని విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. ఇంక ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టడమో, లేకపోతే కమ్యూనిస్టులంతా కలిసి బరిలోకి దిగడమో చేయాల్సిందే తప్ప కామ్రేడ్లకు ఏ ఇతర ప్రత్యామ్నాయం లేదనేది సుస్పష్టం. వారు ఎలాగూ బీజేపీ వైపు వెళ్లే అవకాశం లేదు కాబట్టి మిగిలినవి ఈ రెండు మార్గాలే. లేదంటే అసలు ఈసారికి ఎన్నికల జోలికే పోకుండా, మళ్లీవచ్చే 2029ఎన్నికల నాటికి బలం పెంచుకునే ప్రయత్నాలు చేయడమే మిగిలి ఉన్న మరో ప్రత్యామ్నాయం. ఊరట కలిగించే విషయమేంటంటే మరీ ఎన్నికల సమయం దగ్గరపడి, ప్రకటన వెలువడిన తర్వాత కాకుండా కాస్తంత ముందే కేసీఆర్ వైఖరి స్పష్టం కావడంతో కామ్రేడ్లకు తేలికగా ఊపిరి తీసుకునే అవకాశం లభించింది. అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు అడపాదడపా చేస్తూవచ్చిన ప్రకటనలు తప్ప, పొత్తులకింకా సమయం ఉందంటూ చెప్తూ వచ్చిన సీపీఎం నేతలు, తమ వైఖరి స్పష్టంగా తేల్చుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రకటనకు మరి కాస్త సమయం ఉండటంతో కాస్త వెసులుబాటు లభించినట్లయింది. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని, తెలంగాణలో ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీతో జతకట్టడంతో ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఇప్పుడు కమ్యూనిస్టుల ముందు ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇంకా సమయం ఉండటంతో ఎన్నికల పొత్తులపై ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారి పోయింది.