ఊరించి… ఉడికించి… సిట్టింగులకు వరమిచ్చిన అధినేత
బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి భారీ జాబితా ప్రకటన
✍🏽 కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ మీడియా
అటు అధికారపార్టీలో, ఇటు ప్రతిపక్ష పార్టీల్లో ఆసక్తికరమైన చర్చోపచర్చలతోనే రచ్చ రచ్చగా మారిన బీఆర్ఎస్ అభ్యర్థుల ఆశనిరాశల ఊగిసలాటకు ఆపార్టీ అధినేత ఒక్కసారే చెక్ పెట్టారు. కొంతకాలం నుంచి ఊరించి ఉడికించిన అభ్యర్థుల జాబితాలో ఏకంగా 115 మందికి ఊరట కలిగించేలా సీఎం కేసీఆర్ సోమవారం చేసిన ప్రకటనతో ఆశావహుల జాతకాలన్నీ తేలిపోయాయి. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క వైరా మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోను గత ఎన్నికల్లో పోటీ చేసినవారు, బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలను మళ్లీ బరిలో దించుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో అధికారపార్టీలో ఆశగా ఎదురు చూస్తున్నవారితోపాటు ప్రతిపక్షాల్లో కూడా స్పష్టత వచ్చింది. ప్రత్యర్థులు ఖరారు కావడంతో వారికి ధీటైన అభ్యర్థులను తమ తరపున రంగంలోకి దింపేందుకు ప్రతిపక్ష పార్టీలకు కూడా అవకాశం కల్పించినట్లైంది. ఊహించిన విధంగానే వైరాలో రాజకీయం వేడెక్కుతున్న తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములునాయక్ ను పక్కన పెట్టిన కేసీఆర్ మదన్ లాల్ కు ఛాన్స్ ఇచ్చారు. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనకు ముందు వైరాలో మదన్ లాల్ ప్రతిష్ట దెబ్బతీసేలా ఆయనపై ప్రత్యర్థులు సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రచారం వృధాగా మారింది. కొత్తగూడెంలో పలు వివాదాలు, ఆరోపణలతో వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావే తమ అభ్యర్థిగా ప్రకటించి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విలక్షణమైన తన మార్కు చాటుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితులను కల్పించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నుంచి పిరాయించి కేవలం ఓరోజు ముందే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరిన భద్రాచలం నాయకుడు తెల్లం వెంకటరావుకు వ్యతిరేక కార్యక్రమాలు ఓవైపు కొనసాగుతుండగానే ఆయనే తమ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత ప్రకటించడం విశేషం. తాజాగా ప్రకటించిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి…






