ఆర్డీఓకు వినతిపత్రమిచ్చిన దివ్యాంగుల సొసైటీ ప్రతినిధులు
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
భద్రాచలం డివిజన్ పరిధిలో తమకున్న పలు సమస్యలపై భద్రాద్రి ఫిజికల్లీ హ్యాండీ క్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఊటుకూరి సాయిరాం, సెక్రటరీ అన్నం సత్తిబాబు ఆధ్వర్యంలో భద్రాచలం ఆర్డీఓ మంగీలాల్ ను శనివారం కలిసి సమస్యలపై మెమోరాండం అందజేశారు. ప్రధానంగా
భద్రాచలంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, ఇళ్లు లేని నిరుపేదలకు త్వరగా పంపిణీ చేయాలని గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు కూడా రిజర్వేషన్ తప్పక అమలు చేయాలని కోరారు. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కింద డబల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వ ఆసుపత్రి, శ్రీసీతారామ దేవస్థానం లో దివ్యాంగుల రిజర్వేషన్ ప్రకారం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కేటాయించాలని వారు కోరారు. రెవెన్యూ పరిధిలో పెండింగ్ లో ఉన్న ప్రతి దివ్యాంగుడికి 35 కేజీల బియ్యం అంత్యోదయ కార్డులు మంజూరు చేసే విషయంలో సమస్యను పరిష్కరించాలని, మైనారిటీ బీసీలోన్లు, దళితబంధు పథకాల్లో దివ్యాంగులకున్న ఐదు శాతం రిజర్వేషన్ అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సదరం క్యాంపునకు సంబంధించి చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో నెలలో ఒకరోజు క్యాంపు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, దివ్యాంగులకు ఆర్టీసీ, గ్రామ పంచాయతీ మార్కెట్ యార్డులలో ఖాళీగా ఉన్న షాపులను దివ్యాంగుల ఉపాధికోసం సబ్సిడీపై కేటాయించాలని వారు కోరారు. భద్రాచలంలో పెండింగ్ లో ఉన్న బ్యాటరీ ట్రై సైకిళ్లు, మొదలగు సహాయ పరికరాల పంపిణీకి క్యాంపు నిర్వహించి డివిజన్లో ఉన్న దివ్యాంగులకు సహాయ పరికరాలు అందించాలని, రిజర్వేషన్ ప్రకారం డివిజన్ లో ఖాళీగా ఉన్న రేషన్ షాపులను త్వరగా దివ్యాంగులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, దివ్యాంగుల కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల సొసైటీ కి రెండు సెంట్లు ప్రభుత్వ స్థలం భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దివ్యాంగులకు పని కల్పించి, పని దినాలు కూడా ఎక్కువ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో జరిగే ఎన్నికల్లో దివ్యాంగులు, వృద్ధుల సహాయం కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఓటింగ్ శాతం ఎక్కువగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ వర్షాకాలంలో అన్ని కాలనీల్లో అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని పేర్కొన్నారు. సమస్యలపై భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ గారికి వినతి పత్రం అందించడంతో స్పందించిన ఆర్డీఓ మంగీలాల్, అన్ని సమస్యలపై త్వరలోనే సంబంధిత అధికారులతో చర్చించి, సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు కంభంపాటి రామరుద్రయ్య, శ్యామల కొండా రెడ్డి, లక్ష్మణ్, చైతన్య, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.