స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతిమైదానంలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆదివారం పరిశీలించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కాంతారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. 15వ తేదీ ఉదయం 11 గంటలకు జాతీయ పతాకావిష్కరణ జరుగుతుందని, తర్వాత ముఖ్య అతిధి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమసేవలు అందించిన సిబ్బంది, అధికారులకు ప్రసంశా పత్రాల పంపిణీ, అసెట్స్ పంపిణీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన స్టాళ్ల పరిశీలన ఉంటుందని వివరించారు. అతిథులు, అహూతులు కూర్చోనేందుకు వీలుగా షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మంచి నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పోలీస్ పరేడ్, గౌరవవందనం వివరాలపై రిజర్వ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుల్లయ్య, మున్సిపల్ ఏఈ రాము, టిపిఓ ప్రభాకర్ తదితరులు కూడా పాల్గొన్నారు.

