Divitimedia
Bhadradri KothagudemMahabubabadSpecial ArticlesTelangana

అధికారులకు ‘కత్తి మీద సాము’ లా మారుతున్న ఎంపికలు

గృహలక్ష్మి పథకంలో సాయం కోసం భారీగా అందిన దరఖాస్తులు

అధికారులకు ‘కత్తి మీద సాము’ లా మారుతున్న ఎంపికలు

భద్రాద్రి కొత్తగూడెంలో 86,773, మహబూబాబాద్ లో 52,241 దరఖాస్తులు

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గృహలక్ష్మి పథకంలో సాయం కోసం దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 86,773 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా, చిన్న జిల్లాగా ఉన్న పొరుగు జిల్లా మహబూబాబాద్ లో కూడా 52,241 మంది దరఖాస్తు చేసుకున్నారు. సొంత ఇంటిస్థలం కలిగి ఉండి పక్కాగృహం నిర్మించుకోవానుకునే పేదలకు ప్రభుత్వం రూ.3 లక్షలు సాయంగా అందజేస్తామని ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో పేదప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 10వ తేదీ నాటికే దరఖాస్తుల స్వీకరణ గడువు కూడా ముగిసిపోవడంతో ఇంకా వేలమంది ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకంలో ఇంటి నిర్మాణానికి సాయం కోసం దరఖాస్తు చేసు కోలేకపోయారు. దరఖాస్తుల స్వీకరణకోసం కేవలం 3 రోజులే సమయం ఇవ్వడంతో ఈ దరఖాస్తుల సంఖ్య ఇంత తక్కువ ఉందని, గడువు పెంచినట్లయితే ఇంకా అనేకమంది పేదలు దరఖాస్తు చేసుకునేవారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని ప్రకటించిన ప్రభుత్వం, లబ్ధిదారుల ఎంపిక కోసం పరిశీలన, విచారణ ప్రక్రియను చేపట్టి అర్హులను గుర్తించే పని ఆరంభించింది. ఈ పరిస్థితుల్లో భారీగా వచ్చిన దరఖాస్తులలో వడపోత తర్వాత ఎంతమందికి ‘గృహలక్ష్మి’ మంజూరు చేస్తారనేది ఆసక్తికరంగా మారి పోయింది. అసెంబ్లీ ఎన్నికల ముహూర్తానికి కొన్ని రోజులే గడువు ఉన్న ఈ తరుణంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వానికి ఓ సవాలుగానే మారనుంది. అనర్హుల పేరుతో దరఖాస్తులు తిరస్కరిస్తే వారంతా తమకు వ్యతిరేకంగా మారతారనే భయం అధికార పార్టీలో ఉండనే ఉంటుంది. అందుకే ఎంత మంది వీలైతే అంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసి, తర్వాత దశలవారీగా వారికి ఆర్థికసాయం మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే 86,773మంది గృహలక్ష్మిపథకంలో సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల విచారణ ప్రక్రియకు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అధికారులను ఆదేశించారు. శనివారం గృహలక్ష్మి దీనిపై అన్ని శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతోపాటు అన్ని మండలాల ప్రత్యేకాధికారులతో ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అర్హులను గుర్తించే అంశంలో పాటించాల్సిన మార్గదర్శకాలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 20వ తేదీకల్లా దరఖాస్తుల క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉందని, తదనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆదేశించారు. విచారణ ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతను మండలాల ప్రత్యేకాధికారులు చేపట్టి పరిశీలించాలని, విచారణ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులతో కమిటీ వేయనున్నట్లు ఆమె చెప్పారు. విచారణ ప్రక్రియలో భాగంగా వచ్చిన దరఖాస్తులపై ఇంటింటి సర్వేలో విచారణ పూర్తి చేసిన తర్వాత ఆర్డీఓల ధ్రువీకరణతో జాబితాలు అందజేయాలని ఆదేశించారు. జిల్లాకలెక్టర్ టెలికాన్ఫరెన్సులో ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూస్తే ఈ నెల (ఆగస్టు) 20వతేదీ నాటికల్లా లబ్ధిదారుల ఎంపికలు పూర్తిచేసి జాబితాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు గతంలో హామీ ఇచ్చిన అతి పెద్దదైన రైతు రుణమాఫీ అమలును దశలవారీగా చేస్తున్న ప్రభుత్వం, గతంలోనే ప్రకటించిన దళితబంధు లబ్ధిదారులతోపాటు, ఇటీవలే ప్రకటించి బీసీ బంధు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. వారితోపాటు ప్రస్తుతం ఎంపికచేస్తున్న ‘గృహలక్ష్మి’ పథకం లబ్ధిదారులకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ లోగా ఆర్థికసాయం అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు సమీపిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో లబ్ధిదారులను ఎంపికచేయడం అధికారులకు కూడా ‘కత్తి మీద సాము’ లా పరిణమిస్తోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మండలాల వారీగా అందిన దరఖాస్తుల వివరాలు

  • అశ్వారావుపేట- 5,743
  • అన్నపురెడ్డిపల్లి- 1,921
  • దమ్మపేట- 5,034
  • చండ్రుగొండ- 3,284
  • ములకలపల్లి- 4,194
  • భద్రాచలం- 962
  • చర్ల- 5,787
  • దుమ్ముగూడెం- 12,099
  • కొత్తగూడెం మున్సిపాలిటీ- 2,133
  • పాల్వంచ- 3,991
  • పాల్వంచ మున్సిపాలిటీ- 1,739
  • చుంచుపల్లి- 1,752
  • సుజాతనగర్- 2,522
  • లక్ష్మీదేవిపల్లి- 2,841
  • పినపాక- 3,202
  • మణుగూరు- 2,679
  • మణుగూరు మున్సిపాలిటీ- 1,197
  • కరకగూడెం- 1,736
  • గుండాల- 2,212
  • ఆళ్లపల్లి- 2,106
  • అశ్వాపురం- 1,469
  • బూర్గంపాడు- 3,388
  • ఇల్లందు- 5,054
  • ఇల్లందు మున్సిపాలిటీ- 1,264
  • టేకులపల్లి- 5,289
  • జూలూరుపాడు- 3,175

Related posts

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Divitimedia

ఆహారం తీసుకునే ప్రతిసారి చేతులు శుభ్రపరచుకోవాలి

Divitimedia

గుండాల, కరకగూడెం, ఏడూళ్లబయ్యారం పోలీసుస్టేషన్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ

Divitimedia

Leave a Comment