నలుగురు మావోయిస్టు పార్టీ కొరియర్ల అరెస్ట్
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం
పోలీసులు నలుగురు నిషేధిత మావోయిస్టు పార్టీ కొరియర్లను అరెస్టు చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం ఒ.ఎస్.డి (ఆపరేషన్స్) టి.సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్, దుమ్ముగూడెం సీఐ రమేష్, ఎస్సై కేశవ్, సీఆర్పీఎఫ్ అధికారులు ప్రీతా(అడిషనల్ కమాండెంట్), ఆర్.కే చౌరాసియా వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… శనివారం ఉదయం దుమ్ముగూడెం ఎస్సై పి.కేశవరావు, స్టేషన్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ 141బెటాలియన్ ఎ కంపెనీ సిబ్బంది కలిసి గౌరారం గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో వారు పైడిగూడెం వైపు నుంచి పెద్దనల్లబల్లిసెంటర్ వైపు వస్తున్న కారు(నెంబరు ఎపి-05 ఇడి- 2543)ను ఆపేందుకు ప్రయత్నించగా, కారు డ్రైవర్ కారుని ఆపకుండా వేగంగా వెళ్తుంటే పోలీసులు ఆ కారును వెంబడించి పట్టుకొని తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ఆ తనిఖీల్లో కారులో ఉన్నవారు నిషేధిత మావోయిస్టు పార్టీ కొరియర్లుగా నిర్ధారణ అయిందని వివరించారు. అనంతరం పోలీసులు ఆరెస్టు కాబడిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కొరియర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం నర్సింగపేటకు చెందిన కుంజ రఘువరన్, అదే జిల్లా ఎటపాక మండలం తోటపల్లికి చెందిన పులిపాటి రవితేజ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, సుకుమా జిల్లా దోర్నపాల్ కు చెందిన బైరెడ్డి సతీష్, సుకుమా జిల్లా కుంట తాలూకా నయాపారా గ్రామానికి చెందిన ఉబ్బనపల్లి దినేష్ కుమార్ అనేవారిగా పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.20లక్షల నగదు, ఒక జిలెటిన్ స్టిక్, ఒక మీటరు పొడవైన కార్డెక్స్ వైరు, ఒక డిటొనేటర్, రెండు రౌండ్లు బుల్లెట్లు, కారుతో సహా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
వీరందరూ కలిసి నిషేధిత సిపిఐమావోయిస్ట్ పార్టీ కొరియర్లుగా పనిచేస్తున్నారని పోలీసు అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే వారు శుక్రవారం కూడా మావోయిస్టు పార్టీ వారిని కలిసినట్లు తెలిపారు. వారు పోలీసు వాళ్లు ఎక్కువగా క్యాంపులు ఏర్పాటు చేసి మావోయిస్టు పార్టీకి నష్టం చేస్తున్నారని, ఎలాగైనా పోలీసులను హతమార్చి పోలీస్ క్యాంపులను తీసేయడానికి వారిపై దాడి చేయాలని చెప్పినట్లు వెల్లడించారు. దీనికి అవసరమయ్యే పేలుడు పదార్ధాలు (జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, కార్టెక్స్ వైర్), తూటాలు పెద్దమొత్తంలో కావాలని కోరిన మావోయిస్టుపార్టీ వారు ఈ నలుగురికి రూ. 20లక్షలు ఇచ్చి, వారికి ప్రేలుడు పదార్ధాలు తూటాలు ఇచ్చారని పోలీసులు తెలిపారు.
నిషేదిత మావోయిస్టు పార్టీ వారికి ఎవరైనా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహాయం చేసినట్లైతే అలాంటి వారిపై చట్టంపరంగా కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నట్లు పోలీసు అధికారులు ఈసందర్భంగా హెచ్చరించారు. మావోయిస్టులకు సంబందించి సమాచారం ఏదైనా ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని వారు కోరారు.