పార్ట్ టైం ఫ్యాకల్టీగా పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని విద్యా సంస్థలలో 2023 -24 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన బోధన సిబ్బందిగా (పార్ట్ టైం ఫ్యాకల్టీగా) పనిచేసేందుకుగాను అర్హులైన గిరిజన అభ్యర్థుల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బోధనా సిబ్బందిగా పని చేసేందుకు నియామకం పొందే అభ్యర్థులు డిగ్రీలోగానీ పిజీలోగానీ కనీసం 55శాతం మార్కులతో పాటు ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఈడీ పూర్తి చేసి ఉండాలని, టెట్ పాసై ఉండాలని ఆయన వివరించారు. ఈ ఖాళీల వివరాలు పీఓ తెలిపిన ప్రకారమిలా ఉన్నాయి.
* పీజీటీయూఆర్జేసీ (బాలురు) గుండాలలో ఇంగ్లీష్-1
* యూఆర్జేసీ (బాలికలు) సుదిమల్లలో బయోలాజికల్ సైన్స్- 1
* యూఆర్జేసీ (బాలికలు) వైరాలో ఫిజికల్ సైన్స్-1
ఇదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ గా పని చేసేందుకు యూఆర్జేసీ (బాలురు) తిరుమలాయపాలెం, సింగరేణిలలో జువాలజీ, లెక్కలు, ఆర్జేసీ (బాలికలు) అంకంపాలెంలో బోటనీ, ఎస్ఓఇ ఖమ్మంలో సీనియర్ ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్ ఒక్కొక్కటి చొప్పున పోస్టులు ఖాళీ ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులు విద్యార్హతల ధ్రువపత్రాల నకళ్లతో జతపర్చి నేరుగా ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు సాయంత్రం 5గంటలలోగా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలోని గురుకులం ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో పని దినాలలో మాత్రమే సమర్పించాలని కోరారు. దరఖాస్తు ఫారం ఖరీదు రూ.100 గా ఉందని, అభ్యర్థులు సాధించిన మార్కులు ఆధారంగా, డెమో ద్వారా మాత్రమే ఎంపిక చేయబడతారని పీఓ స్పష్టం చేశారు. మహిళా విద్యాసంస్థల్లో మహిళలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలకోసం 9550730261, 9949723291 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలని ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ తెలిపారు.