ప్రజాఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యం
కనిగిరిలో ప్రత్యేక ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమం


✍️ దివిటీ మీడియా (మార్కాపురం)
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు సోమవారం కనిగిరి పోలీసుస్టేషన్ ఆవరణలో ప్రత్యేక ‘ప్రజా సమస్యల పరిష్కారవేదిక (మీకోసం)’ కార్యక్రమం నిర్వహించారు. కనిగిరితో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి, సమస్యలకు సంబంధించిన పూర్తివివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదు చట్టపరిధిలో పరిశీలించి, సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.
అందిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి సారించి, చట్టప్రకారం సమగ్రవిచారణతో బాధితులకు సత్వరన్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ ప్రజాఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై తన నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలు రిపోర్ట్ పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలందించడంతోపాటు పోలీస్ వ్యవస్థ ను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కనిగిరి పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలు, అందులోనూ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మార్కాపురంలో ఉన్న జిల్లా పోలీసు కార్యాలయానికి దూర ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజాఫిర్యాదులకు అధికంగా ప్రాధాన్యతనిచ్చి పూర్తి స్థాయి విచారణ జరిపి సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ ప్రత్యేక మీకోసం కార్యక్రమంలో 59 ఫిర్యాదులు అందగా, వాటిలో ఎక్కువగా కుటుంబ కలహాలు, భర్త, అత్తింటివారి వేదింపులు, భూములు, ఆస్థి వివాదాలు, తదితర సమస్యలపై పిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో కనిగిరి డీఎస్పీ (ఇంచార్జ్) పి.శ్రీధర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్, పొదిలి సీఐ రాజేష్ కుమార్, పామూరు సీఐ వినోద్ కుమార్, కనిగిరి ఎస్సై సందీప్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాపోలీస్ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించిన మార్కాపురం ఓఎస్డీ
———————–
మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు సోమవారం అందుబాటులో లేక పోవడంతో ఆయన ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా, ‘మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఆయనకు 34 ఫిర్యాదులు అందాయి.

