కొత్తవ్యక్తులు గ్రామంలోకొస్తే వెంటనే పోలీసులకు సమాచారమందించాలి
ఇల్లందు డీఎస్పీ చంద్రభాను సూచనలు
✍️ ఇల్లందు – దివిటీ (ఏప్రిల్ 28)
కొత్తవ్యక్తులు ఎవరైనా గ్రామంలోకి వస్తే వెంటనే పోలీసులకు ఆ సమాచారం అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డీఎస్పీ చంద్రభాను కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బూస్రాయి గొత్తికోయ గ్రామంలో ఆళ్లపల్లి పోలీసులు ఏర్పాటు చేసిన ‘కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్’లో పాల్గొని వలస ఆదివాసీలకు పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామం లోని ప్రతి ఇంటిని సందర్శించి, వారి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులతో డీఎస్పీ మాట్లాడుతూ గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసుశాఖ తరపున సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదీవాసీ ప్రజలకు విద్య, వైద్యం, రవాణా వంటి సౌకర్యాలు అందించడంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎల్లవేళలా ముందుంటారని, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. దురలవాట్ల నుంచి దూరంగా ఉంటూ, గ్రామంలోని యువత మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ సురేష్, ఆళ్లపల్లి ఎస్సై సోమేశ్వర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.