న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చి అన్యాయమా?
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి: షర్మిలారెడ్డి
✍️ అమరావతి – దివిటీ (మార్చి 11)
అధికారంలోకొచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆమె రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యలపై మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఏపీ ప్రభుత్వం వైఖరిని తప్పుపట్టారు. మాట తప్పి మోసం చేయడమంటే ఇదేనని, తమ గోడు ప్రభుత్వానికి వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. వారి గొంతు నొక్కి, ఆందోళలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్టగా ఆమె అభివర్ణించారు. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చించాలన్నారు.
అంగన్వాడీలకు నెలకు గౌరవ వేతనం రూ.26వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ చెల్లింపు హామీని తక్షణం అమలు చేయాలని కోరారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి పరిగణించాలని, హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలివ్వాలని,
పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో అంగన్వాడీలు మరణిస్తే వారి కుటుంబసభ్యులకు ఉద్యోగంతో పాటు మట్టి ఖర్చుల కింద రూ.20వేలు ఇవ్వాలన్నారు. వీటితో పాటు ఇతర 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.