బూర్గంపాడు పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ



సైబర్ నేరాల పట్ల ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తుండాలి : ఎస్పీ రోహిత్ రాజు
✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 6)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గురువారం బూర్గంపాడు పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు పరిశీలించిన ఆయన పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన భాదితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే విచారణ చేపట్టి భాదితులకు న్యాయం చేకూరేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగులో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంటికి కనపడకుండా ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ సతీష్, బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.