బీఆర్ఎస్ నేత కేటీఆర్ మీద మరో కేసు
✍️ హైదరాబాద్ – దివిటీ (జనవరి 10)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీద పోలీసులు తాజాగా శుక్రవారం మరో కేసు నమోదు చేశారు. ‘ఫార్ములా ఇ’ కేసులో విచారణ తర్వాత ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్, కార్యకర్తల కోలాహలం నడుమ ర్యాలీగా తెలంగాణ భవన్ కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఆయన మీడియాతో మాట్లాడుతుండగా, అక్కడ ఉన్న పోలీసు అధికారులు అభ్యంతరం చెప్పారు. ఈ విషయంపై పోలీసులపై ఆగ్రహించిన కేటీఆర్, తీవ్ర అసహనంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లే సమయంలో ర్యాలీకి అనుమతులు లేవనే కారణంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కేటీఆర్తో పాటు బాల్క సుమన్, మన్నె గోవర్ధన్, జయసింహ, క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ లపై కూడా కేసు నమోదు చేశారు.