పెండింగ్ శాలరీ బిల్లు చేయడానికి రూ.10వేలు లంచం
ఏసీబీకి చిక్కిన మైనారిటీ పాఠశాల ప్రిన్సిపల్
✍️ ఇల్లందు – దివిటీ (జనవరి 9)
మైనార్టీ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలికి పెండింగ్ లో ఉన్న జీతం మంజూరుకు లంచం డిమాండ్ చేసిన ప్రిన్సిపల్ ను గురువారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. ఫిర్యాదుదారు కథనం మేరకు ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని మైనార్టీ పాఠశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో బోధిస్తున్న తెలుగు ఉపాధ్యాయురాలు సంధ్యారాణి శాలరీ చేయడానికి ప్రిన్సిపాల్ భీమనపల్లి కృష్ణ రూ.10వేలు లంచం డిమాండ్ చేశారు.
ఆ డబ్బు కోసం పదిరోజులుగా ఇబ్బంది పెడుతుండటంతో సంధ్యారాణి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈమేరకు వలపన్నిన ఏసీబీ అధికారుల సూచనల ప్రకారం ఆమె రూ.2వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. గురువారం ఆ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లగా ప్రిన్సిపల్ అటెండర్ రామకృష్ణకు ఇవ్వమని చెప్పి పంపాడు. టీచర్ సంధ్యారాణి అటెండర్ కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ బృందం దాడి చేసి పట్టుకుంది. ఈ కేసులో ప్రిన్సిపల్, అటెండర్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.