చైనా మాంజా అమ్ముతున్నవారిపై కేసులు నమోదు
✍️ కొత్తగూడెం – దివిటీ (జనవరి 2)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రమైన కొత్తగూడెంలో పోలీసులకు గురువారం నిషేధిత చైనా మాంజా (గాలిపటాలు ఎగురవేసేందుకు వాడే ప్రమాదకరమైన దారం) పట్టుబడింది. కొత్తగూడెంపట్టణం లో నిషేధిత చైనా మాంజా అమ్ముతున్న వారి గురించిన సమాచారం మేరకు ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో పోలీసులు తనిఖీలు జరిపారు. కొత్తగూడెం 3 టౌన్ సీఐ కె.శివప్రసాద్, ఎస్సైలు పురుషోత్తం, మస్తాన్, సిబ్బందితో కలసి చిన్నబజార్, పెద్దబజార్ ఏరియాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పెద్దబజార్ లోని పవన్ టాయ్స్ షాపులో 5.3బండిల్స్ మాంజా చారక్, త్రెడ్ రోల్ 10 ప్యాకెట్లు, పవన్ జనరల్ మర్చంట్స్ లో మాంజా 14 బండిల్స్ ను పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటనలో నిందితులపై కేసు నమోదు చేశారు. చైనా మాంజా వాడకం ప్రజల ప్రాణాలకు, వాహనదారులకు, పక్షిజాతికి ప్రమాదకరమైనందున ప్రభుత్వం వారిచే నిషేధించబడినట్లు పోలీసులు చెప్పారు. అందుకే చైనా మాంజా అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఘటనలో సీజ్ చేసిన నిషేధిత చైనా మాంజా విలువ రూ.9100 ఉంటుందని, కండెవల పవన్, బ్రిజ్ కిశోర్ సాహు అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.