బీటీపీఎస్ కాంట్రాక్టర్స్ యూనియన్ ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే





ఎమ్మెల్యే పాయంను సత్కరించిన యూనియన్
✍️ మణుగూరు – దివిటీ (జనవరి 2)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చిక్కుడుగుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన ‘బీటీపీఎస్ లోకల్ కాంట్రాక్టర్స్ యూనియన్ అసోసియేషన్ నూతన ఆఫీస్’ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి గురువారం ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాయం వెంకటేశ్వర్లును యూనియన్ అధ్యక్షుడు కె.వి.సుబ్బారెడ్డి, సెక్రటరీ బొగ్గం రమేష్, యూనియన్ నాయకులు శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ, యూనియన్ ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. కార్మికుల పట్ల, కార్మిక సమస్యల పట్ల యూనియన్ ఎప్పుడూ అండగా ఉంటుందని, కార్మికులు ఒక మంచి నాయకులను ఎంచుకున్నారని తెలిపారు. కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా 24 గంటలూ అందుబాటులో ఉండి సమస్య పరిష్కరిస్తారని, లోకల్ కాంట్రాక్టర్స్ యూనియన్ కు ఎల్లప్పుడూ తన అండ ఉంటుందని తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన అతి కొద్దికాలం లోనే బీటీపీఎస్ స్థాపనకు కృషి చేశానని తెలిపారు. ఈరోజు భద్రాద్రి పవర్ ప్లాంట్ వల్ల కొన్ని వందల కుటుంబాలు ఉపాధి పొంది జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయినవారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని ఎమ్మెల్యే పాయం ఈ సందర్భంగా తెలియజేశారు. పినపాక నియోజకవర్గంలో ప్రతి పేదకుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లోకల్ కాంట్రాక్టర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కేవీ సుబ్బారెడ్డి, బొగ్గం రమేష్, యూనియన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.