సైబర్ మోసాలు, నేరాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
“సైబర్ జాగరూకతా దివస్” కార్యక్రమంలో నిపుణులు
✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 6)
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సైబర్ మోసాలు, నేరాల పట్ల అందరూ అప్రమత్తతతో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనలతో జిల్లా సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం ‘సైబర్ జాగరూకత దివస్’ సందర్భంగా సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చుంచుపల్లిలో సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్లో నిర్వహించిన ఈ అవగాహనా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, సింగరేణి ఎంప్లాయిస్ అసోసియేషన్, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిథులు దాదాపు 100 మంది పాల్గొన్నారు. జిల్లా సైబర్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సెంటర్ ఇన్స్పెక్టర్ జితేందర్ ఈ కార్యక్రమంలో ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త విధానాలతో అమాయకుల ఖాతాల నుంచి నగదు ఏ విధంగా కాజేస్తున్నారో వివరించారు. డిజిటల్ అరెస్టులు, కస్టమర్ కేర్ మోసాలు, ఇన్సూరెన్స్ సంబంధితమోసాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, మోసపూరిత ఆన్లైన్ లింకులు, ఓటీపీ ఫ్రాడ్స్, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా 1930 టోల్ ఫ్రీ నంబరు పనిచేసే విధానం, గోల్డెన్ అవర్ ప్రాధాన్యత గురించి వివరించారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా నమోదవుతున్న సైబర్ నేరాల గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడిన ప్రజలు వెంటనే గ్రహించి స్పందించగలిగితే సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఆ నేరస్తుల ఖాతాలు ఫ్రీజ్ చేయడం జరుగుతుందని అన్నారు.సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా సూచించారు.