సైబర్ నేరాలపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలి
మణుగూరు పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు




✍️ మణుగూరు – దివిటీ (ఆగస్టు 9)
ప్రజలు సైబర్ నేరాల బారినపడకుండా వారిని పోలీసు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, గంజాయిరవాణా, జూదం, మట్కా, గుట్కా లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మణుగూరు పోలీస్ స్టేషన్ సందర్శించారు. ముందుగా పోలీసు సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు పరిశీలించి, పలు కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనాస్థలానికి వెళ్లి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుప్రమాదాలు జరగకుండా ప్రజల్లో ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తూ నివారణచర్యలు చేపట్టాలని, స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ సూచించారు. 5ఎస్ అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ రికార్డులు క్రమపద్ధతిలో అమర్చుకోవాలని సూచనలు చేశారు. వర్టికల్స్ వారీగా అధికారులు, సిబ్బంది తమ విధులు బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది సమస్యలనడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషిచేస్తామని ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పి రవీందర్ రెడ్డి, సీఐ సతీష్, ఎస్సైలు ప్రసాద్, రంజిత్, సిబ్బంది పాల్గొన్నారు.