రెండు కార్లలో 21 కేజీల గంజాయి స్వాధీనం
ఏడుగురిని అరెస్ట్ చేసిన కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు
✍️ కొత్తగూడెం – దివిటీ (జులై 8)
రెండు కార్లలో ఏడుగురు నిదితులు తరలిస్తున్న 21 కేజీల గంజాయిని కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి గంజాయితోపాటు రెండు కార్లు, 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో త్రీ టౌన్ ఎస్ఐ పురుషోత్తం, తన సిబ్బంది కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ చేశారు. భావన బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో గల రైల్వేశాఖ స్థలంలో పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్దనున్న రెండు వాహనాలను తనిఖీ చేయగా నిషేధిత గంజాయి గుర్తించినట్లు త్రీటౌన్ సిఐ శివప్రసాద్ తెలియజేశారు. వారి వద్ద నుంచి దాదాపు 21 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనలో పట్టుబడిన నిందితుల వివరాలు కూడా వివరించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలోని చర్లపల్లి కాప్రా ప్రాంతానికి చెందిన బాదల్ రౌత్ (సెంట్రింగ్ వర్క్), ముమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి (డ్రైవర్), సిద్దిపేట్ భారత్ నగర్ కు చెందిన కాలువ వెంకటేష్ (పెట్రోల్ బంక్ వర్కర్), సిద్దిపేట్ గాంధీనగర్ కు చెందిన
మహమ్మద్ సాదుల్ (డ్రైవర్), మోతె ఆకాశ్ (వెల్డింగ్ వర్క్), మేడ్చల్ జిల్లా కాప్రా మండలం అశోక్ నగర్ కు చెందిన నితీష్ యాదవ్ అలియాస్ మోనో (కూలీ), వరంగల్ జిల్లా జఫర్ గఢ్ మండలం గర్నపల్లికి చెందిన
తిరుపతి హరీష్ (ఎయిర్టెల్ వైఫై బ్రాడ్ బ్యాండ్ జాబ్) అనేవారుగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. ఈ
రెండు కార్లలో పట్టుబడిన ఏడుగురు వ్యక్తులు తమతో పాటు గంజాయిని హైదరాబాద్, సిద్దిపేట ప్రాంతాల్లో విక్రయించడానికి తరలిస్తున్నట్లుగా తమ విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు. ఏడుగురు నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు.