రక్షణశాఖ భూముల కోసం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వినతి

రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి బృందం
✍️ హైదరాబాదు – దివిటీ (జూన్ 24)
హైదరాబాదులో రహదారుల విస్తరణతోపాటు ఇతర అవసరాలకోసం రక్షణశాఖ భూములు 2,500ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుముల విజ్ఞప్తి చేశారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ఎంపీలతో కలిసి సోమవారం రక్షణ శాఖ మంత్రిని కలిసిన సీఎం అవసరమైన భూములకు సంబంధించిన వివరాలు అందజేశారు. రావిరాల గ్రామ పరిధిలోని తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం (ఆర్సీఐ) కోసం ఉపయోగించుకుంటున్న విషయాన్ని సీఎం, రక్షణశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్ నగరానికి గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా, గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం ఆ వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిసిన కారణంగా వాటిని పునరుద్ధరించాలని లేదంటే కొత్తగా మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట లోక్ సభ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాంనాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి కూడా ఉన్నారు.