సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ ప్రతినిధులు
✍🏽 దివిటీ – హైదరాబాదు (జనవరి 3)

తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు మరోమారు ముందుకొచ్చిన అదానీ గ్రూప్ తరపున ఆ సంస్థ ఉన్నతస్థాయి ప్రతినిధిబృందం సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపింది. బుధవారం తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పోర్ట్స్ – సెజ్ సిఇఓ, గౌతమ్ అదాని పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదాని ఎరోస్పేస్ సిఇఓ ఆశీష్ రాజ్ వన్షిణ చర్చలు జరిపారు. పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వనిస్తున్నామన్నారు. ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందు నిలబడుతుందన్నారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్కుతో పాటు డేటాసెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వీటికి సంబంధించిన పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ సమావేశంలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసిమ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.