మధ్యంతర బెయిల్ తో చంద్రబాబుకు ఊరటనిచ్చిన ఏపీ హైకోర్టు
✍🏽 దివిటీ మీడియా – అమరావతి
సకల సదుపాయాలతో, స్వేచ్చగా జీవితం గడుపుతున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాజమండ్రి సెంట్రల్ జైలులో పడుతున్న ఇబ్బందులకు విరామం కల్పిస్తూ ఏపీ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ఊరటనిచ్చింది.
‘స్కిల్డెవలప్మెంట్ స్కీమ్’ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన తర్వాత జైల్లోనే ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై సోమవారమే విచారణ పూర్తిచేసిన ఏపీ హైకోర్టు తీర్పును మంగళవారం వెలువరించింది. ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరైంది. చంద్రబాబు ఆరోగ్యస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు తదుపరి విచారణ నవంబర్ 28కి వాయిదా వేసింది. సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్టైన బాబు, 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రూ.1లక్ష పూచీకత్తుతోపాటు 2 ష్యూరిటీలు సమర్పించాలని న్యాయస్థానం ఈ సందర్భంగా ఆదేశించింది. నవంబర్10 న చంద్రబాబునాయుడి రెగ్యులర్ బెయిల్ గురించి విచారణ జరగనుంది. చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సంపూర్ణంగా ఆరోగ్యం కలగాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవకు పునరంకితం కావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఆయన అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. మరో వైపు చంద్రబాబుకు బెయిల్ రావడం పట్ల సంతోషంగా ఉందని, ఇది ప్రజల గెలుపని ఆయన సతీమణి భువనేశ్వరి అన్నారు.
చంద్రబాబునాయుడి కోసం ప్రజల పోరాటం గెలిచిందని, న్యాయం గెలిచిందంటూ ఆమె వ్యాఖ్యానించారు. తమ యాత్రపై ఆలోచన చేయలేదని భువనేశ్వరి స్పష్టం చేశారు.