కొత్తగూడెంలో పోలీసుశాఖ మెగా రక్తదాన శిబిరం
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సూచనల మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ల వారీగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగానే కొత్తగూడెంలోని ఐఎంఏ ఫంక్షన్ హాలులో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయిమనోహర్ ముఖ్యఅతిథిగా హాజరై శిబిరం ప్రారంభించగా, పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు స్థానికులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో 120మంది రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ సాయిమనోహర్ మాట్లాడుతూ, దేశంకోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ, జిల్లా ఎస్పీ డా.వినీత్ సూచనలతో చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలనుంచి మంచిస్పందన రావడం చాలా ఆనందకరంగా ఉందన్నారు. రక్తదానం చేయడంద్వారా ప్రాణాపాయస్థితి ఉన్న ఎందరివో ప్రాణాలు కాపాడుకోవచ్చని, రక్తదానం చేసిన వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా శరీరాన్ని కాపాడుకునేందుకు తగిన శక్తి లభిస్తుందని తెలిపారు. రక్తదాన శిబిరం నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. రక్తదాతలకు అరటిపండ్లు, పండ్లరసాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయబాబు, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఎస్బీ సీఐ నాగరాజు, సీఐలు పెద్దన్నకుమార్, కరుణాకర్, రమేష్, మురళి, ఆర్ఐలు రవి, సుధాకర్, నరసింహారావు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
